ఏ 2 టీవీ న్యూస్ మార్చి 8, జిల్లా ప్రతినిధి:
సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, రైతు వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్, అఖిల భారతీయ కార్యకారిణి సభ్యుడు భాగయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జీవ నియంత్రణ ప్రయోగశాలను పరిశీలించారు. అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ను ప్రారంభించి అక్కడి పరికరాల పనితీరు గురించి తెలుసుకున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో సాగుచేస్తున్న సేంద్రియ పంటలు, ఉత్పత్తుల ప్రదర్శనను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించి భవిష్యత్తు వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

