ఏ 2 టీవీ న్యూస్ మార్చి 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)




భూ హక్కులను పక్కాగా నిర్ధారించేందుకు ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుమారు 100 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వ కాలంలో 35 నుంచి 40 సంవత్సరాల పాటు కష్టపడి భూమి నక్షాలను రూపొందించారని చెప్పారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూ నక్షాల్లో సమస్యలు ఏర్పడినట్లు తెలిపారు. ఆ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీసర్వే కార్యక్రమాన్ని శాస్త్రీయంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రతి భూకమతానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ డిజిటలైజేషన్ ద్వారా నమోదు చేసి, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమి ప్రతి రైతుకు ఎంతో విలువైన ఆస్తి అని, రైతుల భూ హక్కులను పరిరక్షించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల భూ హక్కులను కాపాడుతామని చెప్పారు. రీసర్వే అనంతరం విదేశాల్లో ఉన్నవారు సైతం తమ భూములను ఆన్లైన్ ద్వారా సులభంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

