ఏ2టీవీ న్యూస్ మార్చి14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)




మెదక్, శనివారం: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్షలు ప్రశాంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సర్ధనలోని ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రంతో పాటు మెదక్ పట్టణంలోని సిద్ధార్థ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బి ఎన్ ఎస్ సెక్షన్ 163 (పూర్వం 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. చీటీలు పంపించడం, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి సామాజిక వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా మరియు పరీక్ష అనంతరం సమాధాన పత్రాల భద్రత కోసం ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పరీక్షల ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతర పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, పరీక్షల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక బందోబస్తు కొనసాగుతుందని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.

