ఏ2టీవీ న్యూస్, మార్చి 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మంజీరా నదీ తీరాన వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వన దుర్గ భవాని మాత విరాజిల్లుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికి, వారి పేర ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం అత్యంత గౌరవనీయమైన క్షేత్రమని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని, ముఖ్యంగా ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్వాహకుల సేవలు అభినందనీయమని కొనియాడారు.జిల్లా ప్రజలందరూ దుర్గామాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవో వీరేశం, సిబ్బంది శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

