ఏ2టీవీ న్యూస్, మార్చి31, చేగుంట ప్రతినిధి (రాము)


మెదక్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మంగళవారం చేగుంట పోలీస్ స్టేషన్లో “ సజీవంగా చేరుకోండి” కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అధికంగా ప్రమాదాలకు గురవుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు. రైడర్తో పాటు పిలియన్ కూడా ఐఎస్ఐ ప్రమాణిత హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు.దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రమాదాలు గణాంకాలు మాత్రమే కాకుండా కుటుంబాల విషాదం అని అన్నారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

