ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంఘ నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడని తెలిపారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు.కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని ఆమె అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని చెప్పారు.మహనీయులను కులం, వర్గం అనే పరిమితుల్లో చూడకుండా వారి ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

