ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా: జిల్లాలోని చౌక ధరల దుకాణాల పనితీరు ఆదర్శవంతంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనాలు సమర్థవంతంగా, పారదర్శకంగా చేరేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న 520 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) సరుకులు పారదర్శకంగా పంపిణీ జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సరఫరా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మకుండా ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే రేషన్ సరుకులను పొందాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పత్తి నగర్ ప్రాంతంలో ఉన్న షాప్ నంబర్-04 చౌక ధరల దుకాణాన్ని ఆదివారం కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, పౌర సరఫరాల ఇన్స్పెక్టర్ నరసింహులు, సిబ్బంది నాగరాజుతో కలిసి ఆమె స్టాక్ వివరాలు, తూకాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ, సివిల్ సప్లై శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

