ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న “అరైవ్ అలైవ్ వీక్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని ఎస్పీ తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన 8–9 మంది సభ్యులతో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయనున్నారనీ, రిటైర్డ్ టీచర్లు, వైద్యులు, ఆశా/అంగన్వాడీ సిబ్బంది, యువజన సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులను సభ్యులుగా చేర్చి, కనీసం ముగ్గురు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రమాణ స్వీకారం నిర్వహించి, గుంతలు పూడ్చడం, ఓపెన్ వెల్స్ మూసివేయడం, పొదలు తొలగించడం వంటి చర్యలు చేపడతారనీ, అవగాహన కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, సురక్షిత రోడ్డు దాటే విధానంపై ప్రదర్శనలు నిర్వహిస్తారనీ, స్కూల్ ప్రాంగణాల్లో వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేసి హ్యూమన్ చైన్ కార్యక్రమాలు చేపట్టి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం చేపడతారనీ, డ్రైవర్ల లైసెన్సులు, వాహన పత్రాలు తనిఖీ చేసి ఆటో రిక్షాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారని చెప్పారు. ఓవర్లోడింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్పై కఠిన చర్యలుతీసుకుంటామని, రోడ్డు ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. పోలీస్, అంబులెన్స్ సిబ్బంది, వాలంటీర్లకు ఫస్ట్ ఎయిడ్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు జరిమానాల బదులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారనీ, స్కూల్ బస్సుల భద్రత తనిఖీలు చేసి, స్కూల్ జోన్లలో జీబ్రా క్రాసింగ్లు, సూచికలు ఏర్పాటు చేసి “స్లో డౌన్ – స్కూల్ జోన్” వంటి హెచ్చరికల ద్వారా విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సాధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. “స్పీడ్ తగ్గించు – జీవితం కాపాడు”, “జాగ్రత్తగా నడపు – సురక్షితంగా చేరుకో” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

