
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా “అరైవ్ అలైవ్ వీక్” కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్న “అరైవ్–అలైవ్” కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు భద్రత సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసరమని అన్నారు. “అరైవ్–అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అధికారులపై ఉన్న ముఖ్య బాధ్యత అని సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు సహా స్థానిక ప్రజాప్రతినిధులను మరియు అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని తెలిపారు.ఈ నెల 13న అన్ని గ్రామపంచాయతీలలో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అలాగే రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి, వాటిలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించారు.రోడ్ల పక్కన ఉన్న గుంతలు, పాడుబడిన బావులను పూడ్చివేయడం, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.15వ తేదీన “చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే”గా నిర్వహించి, చిన్నపిల్లలకూ హెల్మెట్, సీట్ బెల్ట్ అవసరంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడడం, డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్పై ప్రచారం చేపట్టాలని సూచించారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ కలిగి ఉండేలా చూడాలని పేర్కొన్నారు.16వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స అందించడం, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో కృషి చేసిన వారిని గుర్తించి సన్మానించాలని అన్నారు.18వ తేదీన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. అలాగే మండల స్థాయిలో జరిగే ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, ప్రధాన కూడళ్లలో మానవహారాలు నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో బ్లాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.

