ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కీలకంగా నిర్వహించనున్న “అరైవ్ అలైవ్” గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలోని 492 గ్రామపంచాయతీలలో గ్రామ సభలను పటిష్టంగా నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు.ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా ఆర్డీవోలు, జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, డీఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొన్నారు.గ్రామ సభలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేసిన ఆమె, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభల కోసం బ్యానర్లు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.గ్రామ సభల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే సందేశం, అతివేగం నివారణ వంటి అంశాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రమాదాలను తగ్గించడం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలలో రిటైర్డ్ టీచర్లు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.మద్యం సేవించి, అతివేగంగా లేదా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు.ఈ గూగుల్ మీట్లో అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

