ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగు జాడల్లో నడవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా, షెడ్యూల్ కులాల మార్గదర్శకుడిగా డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అపారమన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల విశేషాలను సమన్వయం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం అంబేద్కర్ గొప్పతనమన్నారు. ఆయన దూరదృష్టి వల్లే దేశంలో ప్రజాస్వామ్యం బలపడిందని, ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిందని, సమాజంలో శాంతి, సామరస్యానికి దోహదపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్ఓ జో.జి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుల పెంటయ్య, దుబాషి సంజీవ్, గరుగుల శ్రీనివాస్, దుర్గాప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

