
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. వడగాలుల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, జిల్లా పరిపాలన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అన్ని శాఖల సమన్వయంతో తాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల్లో ORS మరియు మందుల నిల్వలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కార్మికులు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచించారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.జిల్లాలో బస్ స్టాండ్లు, మార్కెట్లు, పనిస్థలాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

