
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చని, రైతులు సాంప్రదాయ పంటల నుంచి లాభసాటి కూరగాయల సాగు వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల పంటలకు సబ్సిడీలు అందిస్తున్నదని ఆమె తెలిపారు.మంగళవారం టేక్మాల్ మండలం చంద్రు తండాలో కలెక్టర్ పర్యటించి, 256 మంది రైతులు సాగుచేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అభినందించారు.కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కష్టాన్ని నమ్ముకుని పనిచేసే వాడని, “రైతే దేశానికి వెన్నుముక” అనే నినాదానికి చంద్రు తండా నిదర్శనమని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ, లాభసాటి కూరగాయల సాగుతో రైతు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం హర్షణీయమన్నారు.టమాటా, కాకర, చిక్కుడు, సొరకాయ వంటి కూరగాయలను సేంద్రియ ఎరువులతో పండించడం వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరిగి, నాణ్యమైన ఉత్పత్తి లభిస్తోందని తెలిపారు. రైతులు స్వయంగా మార్కెట్కు వెళ్లి తమ పంటలను విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నారని చెప్పారు.ప్రభుత్వం ద్వారా సబ్సిడీతో స్ప్రింక్లర్లు అందజేస్తున్నామని, వ్యవసాయ అధికారులు రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబిస్తున్న రైతులు ఇప్పుడు లాభాల బాట పట్టారని, అనేక మంది సాగును లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, సర్పంచి స్రవంతి సర్దార్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఏఈఓ వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

