ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు.నీటి లోతు తెలియకపోవడం, జారి పడటం వంటి కారణాలతో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు.పిల్లలకు ఈత నేర్పించాలని భావిస్తే, తప్పనిసరిగా తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలని సూచించారు. గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రమాదం జరిగే ముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని, పిల్లల సరదా తల్లిదండ్రులకు జీవితాంతం మిగిలే విషాదంగా మారకూడదని అన్నారు.అదేవిధంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ, అటువంటి చర్యలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లు తేలితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.వేసవి కాలంలో పిల్లలు ఎక్కువ సమయం ఖాళీగా ఉండే పరిస్థితుల్లో, వారిని ఇంట్లోనే ఉంచి చదువు, క్రీడలు లేదా ఇతర సృజనాత్మక కార్యకలాపాల వైపు దారి చూపాలని సూచించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ సమిష్టిగా బాధ్యత వహించాలని ఎస్పీ కోరారు.

