ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని చెప్పారు.సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా మెదక్, నర్సాపూర్ బస్ డిపోల నుంచి బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మెదక్ డిపో నుంచి 100, నర్సాపూర్ డిపో నుంచి 34 బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. అవసరానికి అనుగుణంగా కొత్తగా కండక్టర్లను నియమించడమే కాకుండా, గతంలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసి వారి సేవలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్, కంపెనీలు సహకరించాలని కోరామని, వారి సహకారంతో అవసరమైన చోట బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.అత్యవసర అవసరాల కోసం 9391942254 కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడిస్తూ, అవసరం ఉన్నవారు సంప్రదించాలని కోరారు. ప్రజల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఎవరైనా ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీపీఆర్ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

