

డ్రైలాండ్–వెట్ ల్యాండ్ సర్వేలో ముందుచూపు అవసరం: కలెక్టర్
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లా సమీకృత కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు ముఖ్య అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనగణన, డ్రైలాండ్–వెట్ ల్యాండ్ సర్వే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు, ఖరీఫ్ సీజన్కు రైతులకు విత్తనాలు–ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు, ఓటర్ మ్యాపింగ్, గ్యాస్ సరఫరా, భూభారతి–సాదా బైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన పారదర్శకంగా నిర్వహించేందుకు తాసిల్దార్లు ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రశ్నోత్తరాల రూపంలో తెలుసుకుంటూ, శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సమర్థవంతమైన జనగణనే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.జిల్లాలోని 606 చెరువుల సంరక్షణలో భాగంగా డ్రైలాండ్–వెట్ ల్యాండ్ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర నిధుల సాధనకు అవకాశం ఉండటంతో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఖరీఫ్ సీజన్కు రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొరత లేకుండా బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 525 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 143 మంది రైతుల నుండి 11 కేంద్రాల ద్వారా 887 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గన్ని బ్యాగుల కొరత లేదని, మిల్లర్లు సహకరిస్తున్నారని చెప్పారు.గృహ అవసరాల గ్యాస్ సరఫరా విషయంలో వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు.భూభారతి మరియు సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా సవరణ, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు తదితర అంశాలలో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. సాదా బైనామా పరిష్కారంలో జాగ్రత్తగా వ్యవహరించి, లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని తెలిపారు.ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలో బీఎల్వోలు ఇంటింటి సందర్శనలు నిర్వహించి వివరాలను సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. అర్బన్, రూరల్ ప్రాంతాల డేటాను సమగ్రంగా పరిశీలించి వందశాతం లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు.ఈ సమీక్ష సమావేశంలో డీఎఫ్ఓ జోజి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డీఎం జగదీష్, డిపిఓ యాదయ్య, పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, సిపిఓ సురేష్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, డీఎం ఆర్టీసీ సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, తాసిల్దార్లు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

