ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం “ఇందిరమ్మ ఇళ్ల పథకం”ను అమలు చేస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించిన ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని గృహాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో శివాయపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు తోట లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, సొంత స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతనిస్తూ గృహాలను మంజూరు చేస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తోందని, ఒక్కో గృహానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 750 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవగా, అందులో 650 గృహాలకు గృహప్రవేశాలు నిర్వహించామని తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, గ్రామ సర్పంచ్, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

