ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
భారత ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం (Census–2027) ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈసారి అందుబాటులోకి వచ్చిన డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self Enumeration) సౌకర్యాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఈ సదుపాయం ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలను ఆన్లైన్లోనే సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ https://se.census.gov.in/ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. స్వయంగా నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగా ముందుగా పోర్టల్లోకి వెళ్లి, తమకు అనుకూలమైన భాషను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ సహాయంతో లాగిన్ అయి, జిల్లా, పిన్ కోడ్, గ్రామం వంటి వివరాలను నమోదు చేయాలి. మ్యాప్లో తమ నివాసాన్ని గుర్తించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసి వివరాలను సమర్పించాలి. చివరగా మొబైల్కు వచ్చే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (SE ID)ను భద్రపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. జనగణనలో భాగంగా ఇంటి నిర్మాణం, వసతి సౌకర్యాలు, కుటుంబ సభ్యుల సంఖ్య, విద్యుత్, తాగునీటి వనరులు, మరుగుదొడ్డి సదుపాయం, వంట ఇంధనం, ఇంటర్నెట్ వినియోగం, వాహనాల వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి వాటిని ధృవీకరిస్తారని చెప్పారు. ఆ సమయంలో ప్రజలు తమ SE IDను చూపించి సహకరించాలని కోరారు. జనగణన ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ ప్రక్రియలో పాల్గొని, సరైన వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు.

