ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
హవేలీ ఘనపూర్, సోమవారం: హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు 65 మంది అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా చేపట్టిన “కళ్యాణ లక్ష్మి” పథకం ద్వారా పేద కుటుంబాల యువతులకు ఆర్థిక సహాయం అందించబడుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాలపై వివాహ సమయంలో పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయంతో వేలాది కుటుంబాలు లాభపడుతున్నాయని పేర్కొన్నారు.అలాగే, సమాజంలో అమ్మాయిల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో, బాల్య వివాహాలను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

