ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ ఆదేశాల మేరకు మెదక్ భరోసా సెంటర్ బృందం సోమవారం శివ్వాయిపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు లింగ వివక్షత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, స్త్రీ వివక్ష, లింగ పక్షపాతం, పితృస్వామ్య వ్యవస్థ వంటి కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. మహిళలు మరియు బాలికల హక్కులు, భద్రత, సమానత్వం, చట్టపరమైన రక్షణ గురించి అవగాహన కల్పించారు.బాల్య వివాహాలను నిర్మూలించడం, మహిళలకు గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు లేదా అన్యాయం జరిగిన సందర్భంలో వెంటనే పోలీసులను లేదా భరోసా సెంటర్ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, యువతతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

