
ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుండి ప్రారంభమైన జనగణన డిజిటల్ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో తన వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వయంగా ఆన్లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడి నంబర్ను ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని కోరారు. అలాగే, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరూ తమ ఐడి నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

