ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

సఖి సెంటర్లో బాధిత మహిళలకు అత్యుత్తమ సేవలు అందించాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ సూచించారు. మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శంగా ఉందని ఆయన ప్రశంసించారు.గురువారం నర్సాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న సఖి కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించి, క్లిష్టమైన కేసులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళలకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.అదేవిధంగా మహిళలు పని చేసే ప్రదేశాల్లో ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై లైంగిక దాడి చట్టాలపై అవగాహన కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలని సూచించారు.అనంతరం రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, గర్భిణులు మరియు బాలింతలకు పోషక విలువలున్న ఆహారం గురించి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా తల్లి–బిడ్డలకు సమగ్ర పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, సీడీపీఓలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

