– డివిజన్ స్థాయి ప్రజావాణి ప్రారంభం
జనగణనకు కట్టుదిట్ట చర్యలు

జిల్లాలో వ్యవసాయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి రేపటి నుండి డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అదే సమయంలో జనగణనను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్డీవోలతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జనగణనను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రేపటి నుండి ప్రారంభమయ్యే వ్యవసాయ వారోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం వ్యవసాయ అధికారులు సమగ్ర కార్యాచరణతో కార్యక్రమాలను అమలు చేయాలని ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రజావాణి” కార్యక్రమాన్ని ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరై ప్రజల వినతులను స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి, ప్రతి వినతికి ప్రత్యేక ధృవీకరణ సంఖ్య కేటాయిస్తారని తెలిపారు.అందిన ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించి, తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.జిల్లా కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రజావాణి విభాగాలను ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

