ఏ 2డిజిటల్ న్యూస్, మే 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడే దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో ఆమె ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు కంచర్ల వందన గౌడ్, మర్రిపల్లి చందన, ఆపర్ణ, బి. వచన్ కుమార్ విస్తృతంగా పర్యటించారు.నర్సాపూర్ పర్యటనకు విచ్చేసిన చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డికి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ స్వాగతం పలికారు. ముందుగా పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఆమె, బాలబాలికల సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా శారీరక వైకల్యం కలిగిన చిన్నారిని చూసి చలించిన చైర్పర్సన్, ఆ చిన్నారికి అవసరమైన శస్త్రచికిత్స చేయించి, పౌష్టికాహారం అందిస్తూ, విద్యాబుద్ధులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. భవిత కేంద్రాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయని, చిన్నారులకు ఆటపాటలతో కూడిన నైపుణ్యాలు నేర్పుతున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే శివంపేటలోని బేతని సంరక్షణ ఆశ్రమాన్ని కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. కమిషన్ సభ్యులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బాలల హక్కుల ఉల్లంఘనలు, పౌష్టికాహార లోపం వంటి అంశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. బాలలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని, పిల్లలపై దాడులను అరికట్టేందుకు కమిషన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.అలాగే ప్రతి ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి సంరక్షణ కేంద్రాల పనితీరును సమీక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి, రామాయంపేట సీడీపీఓ స్వరూప, డీసీపీఓ నాగరాజు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


