– సేవల్లో మరింత నిబద్ధత అవసరం– మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ఏ2డిజిటల్ న్యూస్, మే 5, మెదక్ జిల్లా ప్రతినిధి ( రాము)
మెదక్: పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించే సిబ్బందికి తగిన గుర్తింపు ఎప్పటికప్పుడు లభిస్తుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పదోన్నతులు లభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కానిస్టేబుల్ స్థాయి నుండి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన వారిలో హవేలీఘనపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన నరహరి, నార్సింగి పోలీస్ స్టేషన్కు చెందిన మోహన్, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు చెందిన గోవర్ధన్, మెదక్ టౌన్ ట్రాఫిక్ విభాగానికి చెందిన తహెర్ అలీ ఉన్నారు. విధి నిర్వహణలో వారి అంకితభావం, కృషికి గుర్తింపుగానే ఈ పదోన్నతులు లభించాయని ఎస్పీ తెలిపారు.పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా వారికి కొత్త హోదా చిహ్నాలను అలంకరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “పదోన్నతులు కేవలం హోదాను మాత్రమే కాదు, బాధ్యతలను కూడా పెంచుతాయి. సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణే మన ప్రధాన లక్ష్యం” అని సూచించారు.విధి నిర్వహణలో నిజాయితీ, బాధ్యతతో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగడం సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.


