
ఏ2డిజిటల్ న్యూస్, మే6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలోని బ్యాంకుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, గోల్డ్ లోన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ అలారం సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే మెటల్ డిటెక్టర్లను కూడా అమర్చాలని చెప్పారు.బ్యాంకుల భద్రతా లోపాలను గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ బృందాలు జిల్లాలోని బ్యాంకులను తనిఖీ చేసి సీసీటీవీ వ్యవస్థలు, అలారం సిస్టమ్స్, భద్రతా సిబ్బంది పనితీరును సమీక్షించనున్నాయని చెప్పారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని బ్యాంకు యాజమాన్యానికి సూచించారు.బ్యాంకుల వద్ద అర్మ్డ్ గార్డులు, ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పని చేయని సీసీటీవీలను తక్షణమే బాగు చేయించుకోవాలని, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. అలారం సిస్టంను సమీప పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేయాలని, మోషన్ సెన్సార్ కెమెరాలను అమర్చాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. ఇటీవల చోటుచేసుకుంటున్న దోపిడీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అడిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

