Monday, July 6, 2026

ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి

ప్రభుత్వం రైతు పక్షపాతి : ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

ఏ2డిజిటల్ న్యూస్, మే9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్: రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్, రవాణా, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ధాన్యం తరలింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల వద్ద హమాలీల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ధాన్యం తరలింపులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో వివరించాలని అధికారులను ప్రశ్నించారు.రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఒక రైతు పెట్రోల్ బాటిల్‌తో నిరసనకు దిగిన ఘటనకు బాధ్యులు ఎవరో చెప్పాలని నిలదీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు.తమది రైతు ప్రభుత్వమని, రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు ఎన్నుకుని పంపిన ప్రజాప్రతినిధిగా వారి సమస్యలపై ఎవరినైనా ప్రశ్నిస్తానన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణను సజావుగా నిర్వహిస్తామని తెలిపారు. హమాలీల సమస్యను త్వరలోనే పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. నాలుగు నుంచి ఐదు రోజుల్లో రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని వివరించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధికా భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular