Monday, July 6, 2026

జనగణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం

మారథాన్ వాక్‌కు జెండా ఊపిన కలెక్టర్

జనగణన ట్యాబ్ల ఆవిష్కరణ

ఏ 2 డిజిటల్ న్యూస్, మే11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు నిర్వహించిన తొలి దశ జనగణన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్‌లో పాల్గొన్నారు. ఇంటింటి సందర్శన ద్వారా ప్రజలకు జనగణనపై అవగాహన కల్పించారు. అనంతరం జనగణన ట్యాబ్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశంలో చాలా సంవత్సరాల తర్వాత జనగణన నిర్వహిస్తున్నామని తెలిపారు. 2021లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం నిర్వహిస్తున్న ఇది 16వ జనగణన కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి జనగణన అని పేర్కొన్నారు. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు వెల్లడించారు.స్వీయ గణన విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టడం ద్వారా జనగణన ప్రక్రియలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కుటుంబ వివరాలను ప్రజలే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఇందులో 34 ప్రశ్నలు ఉండగా, కేవలం ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.సోమవారం నుంచి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందించామని చెప్పారు. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశామని, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు.జనగణన పేరుతో అనుమానిత వ్యక్తులు వివరాలు అడిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారిక సిబ్బందికి జారీ చేసిన ఐడీ కార్డులపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తాయని తెలిపారు.జనగణన ప్రక్రియ దేశాభివృద్ధికి ఎంతో కీలకమని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావడం బాధ్యతగా భావించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్ రావు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular