

ఏ2 డిజిటల్ న్యూస్, మే15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యేక దృష్టి సారించారు.శుక్రవారం తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను పరిశీలించిన కలెక్టర్… ధాన్యం దెబ్బతినకుండా సక్రమంగా నిల్వ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కేటాయించిన రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు.తరలించిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకునేలా మిల్లర్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఇస్లాంపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అల్లాపూర్ గ్రామంలోని నవదుర్గా రైస్ మిల్లులో జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ప్రతిమా సింగ్… మద్దతు ధరకు నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతోందని తెలిపారు.కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, పొరపాట్లకు తావివ్వకూడదని అధికారులను హెచ్చరించారు.ప్రతిరోజూ కనీసం పది నుంచి పదిహేను లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్… అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు.ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, ప్రత్యేక అధికారి ఎల్లయ్య, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, మిల్లర్ల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

