
ఏ2డిజిటల్ న్యూస్, మే 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రామాయంపేట, మే 16: రైతుల ధాన్యాన్ని సమయానికి తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఐకెపి (ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ జీఎం మార్కెటింగ్ అధికారి, ఆర్డీవో, డీఎంసీఎస్, డీఎస్ఓ, తహసీల్దార్, ఎంపీడీవోతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా టోకెన్ విధానం అమలులో ఉందా అనే అంశాన్ని ఆమె పరిశీలిస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే కేంద్రాల్లో గోనె సంచులు సరిపడా అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 1,32,992 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 533 కొనుగోలు కేంద్రాల్లో 519 కేంద్రాలు ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల కోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు.టోకెన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ధాన్యం తేమ శాతాన్ని నిర్బంధంగా పరీక్షించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల ధాన్యాన్ని ఆలస్యం లేకుండా తూకం వేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులు ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితులు రాకుండా కాంటాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అక్కడ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, రవాణా వివరాలను పరిశీలించిన కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజని, ఎంపీడీవో, సంబంధిత కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

