ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని మిల్లర్లపై కఠిన చర్యలు
రెండు రైస్ మిల్లులు బ్లాక్లిస్ట్
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు: ప్రతిమా సింగ్
ఏ2డిజిటల్ న్యూస్, మే16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ధాన్యం దిగుమతుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు పీపీసీల నుంచి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకుని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.అయితే, కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాపన్నపేట మండలంలోని మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్ మరియు రామాయంపేట్లోని మేసర్స్ భవాని ఇండస్ట్రీస్ పీపీసీల నుంచి కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదని పేర్కొన్నారు.ఈ కారణంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. దీంతో సంబంధిత జి.ఓ నిబంధనల ప్రకారం పై రెండు రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్మెంట్ మరియు కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుంచి తక్షణ ప్రభావంతో బ్లాక్లిస్ట్ చేసినట్లు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా మిల్లులకు ఎలాంటి ధాన్యం కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ పీపీసీల నుంచి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, లేనిపక్షంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.

