సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలి – విధుల్లో క్రమశిక్షణ పాటించాలి – రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఏ2 డిజిటల్ న్యూస్, మే 19, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మంగళవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలను ఎస్పీ సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించిన ఎస్పీ, ముఖ్య కూడళ్లు మరియు ప్రమాదకర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి శుక్రవారం పోలీసు సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.ఈ తనిఖీలో సీఐలు జాన్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఎస్సై రంజిత్ రెడ్డి తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

