ఏ2డిజిటల్ న్యూస్, మే 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
అకాల వర్షాల పరిస్థితుల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు, కాంటా మరియు రవాణా ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను, మిల్లర్లను ఆదేశించారు.తూప్రాన్ మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఉన్న సాయినాథ్ రైస్ మిల్లును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లులో జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్, లోడింగ్ ప్రక్రియలను పరిశీలించి పలు సూచనలు చేశారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, రవాణా కోసం అవసరమైన లేబర్, లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని మిల్లర్లకు సూచించారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మిల్లు నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

