
పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి
పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ అభినందనలు
ఏ2డిజిటల్ న్యూస్, మే26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యోగంలో హోదా పెరిగిన కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు.మెదక్ జిల్లా పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన కృష్ణ, కృష్ణయ్య అనే ఇద్దరు అధికారులు మంగళవారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఎస్పీ వారి చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్ర చిహ్నాలను అలంకరించారు.ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా ప్రజల పట్ల మరింత బాధ్యతతో పనిచేసే అవకాశమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఎస్పీ తెలిపారు.జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి కీలక పాత్ర పోషించాలని, విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నూతనంగా పదోన్నతి పొందిన అధికారులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

