ఏ2 డిజిటల్ న్యూస్, మే 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లాలోని పురాతన పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా టూరిజం శాఖ సమన్వయంతో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.శనివారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో మెదక్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మీర్ ఖాన్, ఈడీఎం సందీప్, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఈడీఎం, యువజన క్రీడల శాఖ అధికారులు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి వాటి పరిస్థితులను పరిశీలించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన అనుభవాలు, సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన సౌకర్యాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. టూరిజం అధికారులు, డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి పర్యాటక శోభను మరింత పెంపొందిస్తామని కలెక్టర్ వెల్లడించారు.అంతకుముందు మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల చారిత్రక విశిష్టత, వారసత్వ ఆనవాళ్లకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఈడీఎం సందీప్ జిల్లా కలెక్టర్కు వివరంగా సమర్పించారు.ఈ కార్యక్రమంలో డీపీఆర్వో రామచంద్రరాజు, డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

