Sunday, July 5, 2026
Home Blog Page 4

పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

0

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలివిధుల్లో క్రమశిక్షణతో వ్యవహరించాలి

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి

చిన్న శంకరంపేట్ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2 డిజిటల్ న్యూస్, మే 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట్ పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ.. దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా సమయపాలనతో విధులు నిర్వహించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలను కూడా ఎస్పీ సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ.. ముఖ్య కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పనిచేసేలా చూడాలని అధికారులకు సూచించారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.స్టేషన్‌ రిసెప్షన్‌ను పరిశీలించిన ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న రెమావతిని ఆమె బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా నిలుస్తూ వారి ఫిర్యాదులను సక్రమంగా నమోదు చేయడంలో సహకరించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సహాయం అందించాలని తెలిపారు.అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ.. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీఐలు సైదా, సందీప్‌రెడ్డి, ఎస్ఐ శివానందం తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి : మెదక్ జిల్లా ఎస్పీ

0

పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి

పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ అభినందనలు

ఏ2డిజిటల్ న్యూస్, మే26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యోగంలో హోదా పెరిగిన కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు.మెదక్ జిల్లా పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన కృష్ణ, కృష్ణయ్య అనే ఇద్దరు అధికారులు మంగళవారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఎస్పీ వారి చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్ర చిహ్నాలను అలంకరించారు.ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా ప్రజల పట్ల మరింత బాధ్యతతో పనిచేసే అవకాశమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఎస్పీ తెలిపారు.జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి కీలక పాత్ర పోషించాలని, విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నూతనంగా పదోన్నతి పొందిన అధికారులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సుడిగాలి పర్యటన

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 25,:సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

చిలిపి చెడు మండలం సోమక్కపేట గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని సూచించారు.వెల్దుర్తి మండలం నుంచి 30 మందిని రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజన్న ఫౌండేషన్ నిరంతరం సేవలు అందిస్తోందని తెలిపారు.మాసాయిపేట మండలం బొమ్మరం గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలిసి జాతర ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులకంటి పెంటయ్య భార్య అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రుస్తుంపేట గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ

0

ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఎస్పీ ఆదేశాలు

ఏ2డిజిటల్ న్యూస్, మే25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ప్రతి ఫిర్యాదుదారునితో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, దీంతో ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతోందని ఎస్పీ తెలిపారు.

సూర్యుడితో కష్టమే…!

0

బయటకు వెళ్ళొద్దంటున్న వాతావరణ శాఖ

ఏ2 డిజిటల్ న్యూస్, మే 25, మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

ఇప్పటికే ఎండలతో అతలాకుతలమవుతుంటే వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త తెలిపింది. ఈ నెల 29 వరకు సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి భూపాలపల్లి, ములుగు, భద్రాది, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు తెలిపారు.

జిల్లాలో 65 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి

0

మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు పూర్తి చేస్తాం : కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2డిజిటల్ న్యూస్, మే 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు సుమారు 65 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మిగిలిన కొనుగోళ్లను కూడా వచ్చే 10 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆమె పేర్కొన్నారు.ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని తెలిపారు.జిల్లాలో ఇప్పటివరకు 65 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మొత్తం 50,134 మంది రైతుల నుంచి 2,41,574.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 34,460 మంది రైతుల ఖాతాల్లో రూ.379.47 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన చెల్లింపులు కూడా ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు.గత నాలుగు రోజుల్లోనే 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, ధాన్యం నిల్వ కోసం జిల్లాలో 10 ఇంటర్మీడియట్ గోడౌన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుందని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని తెలిపారు.మరో 10 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోజువారీ లక్ష్యాల ప్రకారం మిగిలిన కొనుగోళ్లు పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. రైతులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 24, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగలి వెంకటేశం (48) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశం గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో చికిత్స కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేని పరిస్థితి రావడంతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురై బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వెంకటేశం భార్య రేణుక ఫిర్యాదు మేరకు, ఆమె ఉదయం కూలి పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటేశం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మంగలి కిష్టయ్య ఫోన్ ద్వారా తెలియజేయడంతో ఆమె ఇంటికి చేరుకుని చూడగా వెంకటేశం మృతి చెందినట్లు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహినుద్దీన్ తెలిపారు.

చిలపల్లి వరుస చోరీల కేసులను ఛేదించిన మెదక్ పోలీసులు

0

విశేషంగా కృషి చేసిన పోలీసు బృందాలకు రివార్డులు – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2 డిజిటల్ న్యూస్, మే24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చిలపల్లి గ్రామంలో వరుసగా జరిగిన చోరీల కేసులను మెదక్ జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. దొంగిలించబడిన భారీ మొత్తంలో బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.ఈ నెల 14వ తేదీ రాత్రి పెద్దశంకరంపేట మండలంలోని చిలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 109 తులాలు 9 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులు, రూ.19 వేల నగదు అపహరించారు. మరో ఇంట్లో మూడు తులాల బంగారం కూడా దొంగిలించబడింది.ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, గూఢచారి సమాచారంతో నిందితులను గుర్తించి రామాయంపేట సమీపంలో చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 929.7 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ప్రధాన నిందితుడు జాదవ్ జైరాం నాయక్ అలియాస్ జెమ్లా నాయక్‌పై ఇప్పటికే పలు జిల్లాల్లో అనేక చోరీ కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శంకరంపేట-ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు కేసులతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన మరో 12 కేసులను కూడా నిందితుడు ఒప్పుకున్నాడని చెప్పారు. మొత్తం 17 కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.నిందితులను వేగంగా పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేసినందుకు బాధితులు రాములు, మాణిక్ రెడ్డి జిల్లా ఎస్పీతో పాటు దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. బాధితుడు రాములు మాట్లాడుతూ తమ బంగారం తిరిగి దొరుకుతుందని ఆశించలేదని, దొంగతనం జరిగినప్పటి నుంచి పోలీసులు అండగా నిలిచి ధైర్యం చెప్పారని తెలిపారు. రాత్రింబవళ్లు శ్రమించి కేసును ఛేదించిన పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని గ్రామస్తులు హామీ ఇచ్చారు. కేసును ఛేదించడంలో విశేషంగా కృషి చేసిన ఐదు ప్రత్యేక బృందాల సిబ్బందికి రివార్డులు, నగదు పురస్కారాలు అందజేశారు.ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రేణుక రెడ్డి, జార్జ్, సందీప్ రెడ్డి, ఎస్ఐలు శంకర్, ప్రవీణ్ రెడ్డి, పోచయ్య, సీసీఎస్ బృందం, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా చిలప్చెడు మండలంలో రైతులకు ఊరట

0

కొనుగోలు కేంద్రాలకు ఖాళీ లారీల తరలింపు

ఏ2డిజిటల్ న్యూస్, మే 23, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లా చిలప్చెడు మండలంలోని ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తరలింపునకు లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.మెదక్–సంగారెడ్డి ప్రధాన రహదారిలోని చండూర్ ఎక్స్ రోడ్ వద్ద చిలప్చెడు తహసిల్దార్ జహీర్, ఎంపీడీవో ప్రశాంత్, పోలీస్ సిబ్బంది కలిసి రహదారిపై వెళ్తున్న ఖాళీ డీసీఎంలు, లారీలను నిలిపివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం అవసరమైన మేరకు వాటిని చిలప్చెడు మండలంలోని ఐకెపి మరియు పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలకు తరలించారు.అధికారుల ఈ చర్యతో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం త్వరితగతిన తరలింపుకు మార్గం సుగమమైందని రైతులు తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ జహీర్, ఎంపీడీవో ప్రశాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతు అకాల మరణం వార్త లో నిజం లేదు —జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపూరు గ్రామంలో వెంకటాపురం శంకరయ్య అనే రైతు అకాల మరణం అనే వార్తను పలు పత్రికలు ప్రచురించిన దృశ్య ఆ వార్తలో కొన్ని పత్రికలు నిజాన్ని వక్రీకరించి రాసినట్లు జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అకాల మరణం పట్ల కుల్చారం మండల తహసీల్దార్ (MRO) నివేదిక ప్రకారం, సంబంధిత రైతు గుండెపోటుతోనే మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని తెలియజేసిన ట్లు నివేదికలో పేర్కొనబడినది. సంబంధిత రైతు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయించిన సీరియల్ విధానం ప్రకారమే కొనసాగుతున్నది.అయితే కొన్ని దినపత్రికలలో ధాన్యం కొనుగోలు సమస్యల కారణంగానే రైతు మృతి చెందినట్లు ప్రచురించబడిన వార్త అవాస్తవమని తెలియజేయడమైనది. దీనిని ధాన్యం కొనుగోళ్ల సమస్యలతో ముడిపెట్టి ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని స్పష్టం చేయడమైనది.మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబడగా, 30,210 మంది రైతుల ఖాతాల్లో రూ.336.65 కోట్లను నేరుగా జమ చేయడం పూర్తయింది.నిరంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షలు నిర్వహిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ కొనుగోలు కేంద్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నరు .రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.కావున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.