యువజన క్రీడా – పర్యాటక వారోత్సవాలకు ఘన శ్రీకారం


ఏ2డిజిటల్ న్యూస్, మే 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చూడచక్కని పర్యాటక ప్రాంతాలకు నెలవుగా, ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెట్టింది పేరుగా మెదక్ జిల్లా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడా మరియు పర్యాటక వారోత్సవాలను ఈ నెల 18 నుండి 23 వరకు జిల్లా, మండల స్థాయిలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ స్టేడియం వరకు నిర్వహించిన 5కే రన్ను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.ధ్యాన్చంద్ చౌరస్తా వరకు సాగిన ఈ రన్ అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, స్థానిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లా పాలన సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు.యువత ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్, వ్యాయామాలను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యాయామం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఓర్పు, సహనం పెంపొందుతాయని తెలిపారు. గుండెజబ్బుల ప్రమాదం తగ్గి, ఊపిరితిత్తుల సామర్థ్యం, రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ భారతదేశంలో యువశక్తి అత్యధికంగా ఉందని, యువత ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. నేటి యువతే రేపటి భారత పౌరులని, శారీరక – మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇంత భారీ స్థాయిలో 5కే రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా యువతలో స్నేహభావం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని తెలిపారు. మెదక్ జిల్లా క్రీడాకారులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రాణించడం వెనుక వ్యాయామ ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 300 మందికి పైగా యువత 5కే రన్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



















