“ప్రతి ప్రయాణం సురక్షితం కావాలి” – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రోడ్డు ప్రమాదాల నివారణకు మెదక్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమం కింద శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చైతన్య రథాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రారంభించిన చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా జనసంచారం అధికంగా ఉండే జంక్షన్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు. అదే సమయంలో సెల్ఫోన్తో డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్లో ప్రయాణం, ఓవర్లోడింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసే ప్రమాదమని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణరక్షణకు అత్యవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. అవగాహనతో పాటు నియమాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాథ్, సీఐలు మహేష్, జార్జ్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

















