Thursday, May 7, 2026
Home Blog Page 19

మెదక్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: పౌరసరఫరా అధికారి

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 2 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని జిల్లా పౌరసరఫరాధికారి నిత్యానంద్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.జిల్లాలోని 16 గ్యాస్ ఏజెన్సీలలో రోజుకు సగటున 3,200 సిలిండర్లు బుకింగ్ అవుతున్నాయని, వినియోగదారులకు 100 శాతం గ్యాస్ డెలివరీ నిరంతరంగా కొనసాగుతున్నదని చెప్పారు. ప్రస్తుతం డీలర్ల గోదాములలో 3,500 సిలిండర్లు అందుబాటులో ఉండగా, అదనంగా 6,179 సిలిండర్లు రవాణాలో ఉన్నాయని వివరించారు.గ్యాస్ కొరతపై కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్తలను ఖండించిన ఆయన, జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సమర్థవంతంగా పనిచేస్తూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ కొనసాగుతున్నదన్నారు.అదేవిధంగా, జిల్లా పరిధిలోని టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వాణిజ్య సంస్థలు కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. డొమెస్టిక్ సిలిండర్లను వాడినట్లయితే 6-A కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకుండా, అవసరమైన గ్యాస్‌ను సాధారణ విధానంలోనే పొందవలసిందిగా ఆయన కోరారు.

జంగారాయిలో ఎస్పీ పరామర్శ – 48 గంటల్లో దోపిడీ కేసు ఛేదన

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 31, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలోని జంగారాయి గ్రామంలో వృద్ధ దంపతులపై జరిగిన దోపిడీ ఘటనను పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు బాధితులు సావిత్రి, అంజయ్యలను పరామర్శించి ధైర్యం చెప్పారు.కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని వేగంగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.కేసు ఛేదనలో పోలీసుల పనితీరును గ్రామ ప్రజలు ప్రశంసిస్తూ ఎస్పీని శాలువాతో సన్మానించారు. గ్రామ ప్రజల సహకారంతోనే నిందితుడిని త్వరగా పట్టుకోవడం సాధ్యమైందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లూస్ అందించిన గ్రామస్థులను కూడా సన్మానించారు.ప్రజలు–పోలీసుల సమన్వయంతో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఎస్పీ అన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని సూచిస్తూ, అనుమానితులపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డియస్పి నరేందర్ గౌడ్, సిఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, ఎస్ఐ నారాయణ, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి31, చేగుంట ప్రతినిధి (రాము)

మెదక్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మంగళవారం చేగుంట పోలీస్ స్టేషన్‌లో “ సజీవంగా చేరుకోండి” కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అధికంగా ప్రమాదాలకు గురవుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు. రైడర్‌తో పాటు పిలియన్ కూడా ఐఎస్‌ఐ ప్రమాణిత హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు.దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రమాదాలు గణాంకాలు మాత్రమే కాకుండా కుటుంబాల విషాదం అని అన్నారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

మహిళా సమాఖ్య భవనానికి ఘనంగా భూమిపూజ

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 31, శివంపేట్ ప్రతినిధి (రామకృష్ణ)

మెదక్ జిల్లా శివంపేట్ మండలం, కొత్తపేట గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామ సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి దానం చేసిన మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారికి గ్రామ ప్రజలు మరియు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను గ్రామస్తులు అభినందించారు.

సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి: అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

0

ఏ2టీవీన్యూస్, మార్చి30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు జిల్లా ఎస్పీ ఎస్. మహేందర్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను నేరుగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో అదనపు ఎస్పీ వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని కేసులపై ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను వెల్లడించాలని కోరారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎటువంటి పైరవీలు అవసరం లేదని తెలిపారు. చట్టపరంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ప్రజావాణిలో అందిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 81 దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను సంబంధిత శాఖలకు ఎండార్స్మెంట్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారం వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి అన్ని దరఖాస్తులు పూర్తిగా పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తున్నందున వారి సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యవేక్షణలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఏడుపాయల వనదుర్గా భవానీ దర్శించిన కలెక్టర్ దంపతులు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మంజీరా నదీ తీరాన వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వన దుర్గ భవాని మాత విరాజిల్లుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికి, వారి పేర ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం అత్యంత గౌరవనీయమైన క్షేత్రమని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని, ముఖ్యంగా ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్వాహకుల సేవలు అభినందనీయమని కొనియాడారు.జిల్లా ప్రజలందరూ దుర్గామాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవో వీరేశం, సిబ్బంది శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

రోడ్ల పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీన్యూస్, మార్చి 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో రోడ్లపై పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించి ప్రతి వాహనదారుడు సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, వీధి దీపాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేసి, రోడ్లపై గుంతలు పూడ్చి పెండింగ్ పనులు లేకుండా చూడాలని ఆదేశించారు.విద్యాసంస్థల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి అని తెలిపారు.మత్తు పదార్థాలపై నిఘా పెంచాలని, యువత భవిష్యత్తు దెబ్బతినకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. విద్యాసంస్థలు, మెడికల్ షాపులు, పరిశ్రమల వద్ద మత్తు పదార్థాలపై కఠిన నిఘా కొనసాగుతోందని చెప్పారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా శంకరంపేట-ఆర్ మండలం జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై జరిగిన దాడి–దోపిడీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్‌తో దాడి చేసి వారి ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఫిర్యాదు మేరకు కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడు వరిగే వెంకట నారాయణ (40)ను శనివారం ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి 2½ తులాల పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం ఉంగరం సహా మొత్తం 4½ తులాల బంగారం, (టీవీఎస్ ఎక్స్ఎల్ ) వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు వేగంగా స్పందించి కేసును ఛేదించగా, సంబంధిత పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రజలు అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఘనంగా సీతారాముల కళ్యాణం

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఊరురా, వాడవాడలా ఘనంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా పేర్గాంచిన దేవాలయాలు మొదలుకొని ప్రతి గ్రామంలోని హనుమాన్ ఆలయాల్లో సైతం శ్రీరాములవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. గ్రామ పెద్దలు, ఆలయ నిర్వహకులు గత రెండు రోజుల నుండి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పచ్చటి పందిళ్లు వేసి మండపాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. శుక్రవారం సీతారాముల కళ్యాణం పండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా జరిగింది. ఈ మేరకు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో రామాలయం, నర్సాపూర్ పట్టణ పరిధిలోని సీతారాంపూర్ దేవాలయం, కొల్చారం మండలం రంగంపేట రంగనాయక స్వామి దేవాలయం, మండల కేంద్రమైన కౌడిపల్లి లోని రామాలయం, శివంపేట మండలం దొంతి దేవాలయం, చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయం, చేగుంట మండలం పులిమామిడి గుట్ట రాములవారి దేవాలయం, రామయంపేట, తూప్రాన్ తదితర పట్టణాల్లో శ్రీరాముల వారి కళ్యాణం కమనీయం, రమణీయం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.